వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు

 వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు

విపిఆర్, ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా 10వ తేదీన పలు శంకుస్థాపనలు

అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలి

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు వేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఆగష్టు 10వ తేదీన చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన శంకుస్థాపన ల పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలను నెరవేర్చే పుణ్యక్షేత్రమైన బిల కూట క్షేత్రం చుట్టూ అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కోట్ల రూపాయల విలువైన పథకాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రూ. 1.6 కోట్లు దేవస్థానం నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10వ తేదీ ఉదయం 10 గంటలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తో కలిసి శంకుస్థాపన జరగనుందని తెలిపారు. గతంలో ఆగిపోయిన కోనేరును పూర్తిచేయడానికి వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంతి రెడ్డి ఇద్దరూ రూ. 2 కోట్లు విరాళంగా ప్రకటించి, కోనేరును పునర్నిర్మించేందుకు ముందుకొచ్చారన్నారు. దీని శంకుస్థాపన కూడా అదే తేదీన జరగనుందని తెలిపారు. విఐపీలు, అధికారులు, భక్తులకు వసతుల కోసం రూ. 2 కోట్ల నిధులతో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఎండోమెంట్ మంత్రి రామనారాయణ రెడ్డి మద్దతుతో నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే దానికి కూడా శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. రూ. 2.65 కోట్ల వ్యయంతో దక్షిణ గాలిగోపురం నిర్మాణానికి టెండర్లు పిలవబడినాయని. దేవాదాయ శాఖలో ప్రశాంతి రెడ్డి బోర్డు మెంబర్‌గా ఉండటంతో నిధుల పునర్మంజూరుతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఊపందుకుందన్నారు. అమెరికాలో నివసిస్తున్న బచ్చు కృష్ణకుమార్ దంపతులు రూ. 2 కోట్లు పడమట గాలిగోపుర నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నారని, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో, వారి చేతుల మీదగా నిర్వహించనున్నామని తెలిపారు. కావలి కి చెందిన రమేష్ రెడ్డి స్వంతంగా నిధులు వెచ్చించి, భక్తుల కోసం బాత్‌రూమ్‌లు, కళ్యాణకట్ట నిర్మించేందుకు ముందుకొచ్చారని, ఇది కూడా త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, రూ. 1.5 కోట్లతో 6,000 మంది కూర్చునే సామర్థ్యంతో కళ్యాణ వేదిక నిర్మించనున్నామని, 36,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉండబోతోందని, దాతలను ఈ కార్యక్రమానికి ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దేవతా కార్యాలలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా భాగస్వామ్యం కావాలని, స్వామివారి అనుగ్రహంతో మన గ్రామం, మండలం, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ శ్రద్ధ, విశ్వాసం, దాతల సహకారం, అధికారుల ప్రోత్సాహం ద్వారా ముందుకు సాగుతుండగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు. ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదని, దేవుని ఆశీస్సులతో సమాజాన్ని అభివృద్ధి చేసే యజ్ఞం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin