జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి

జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి..

కావలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,జగజ్జీవన్ రామ్ గారి నూతన భవనం ఏర్పాటు చేస్తాం,యువతకు వారు దేశం కోసం చేసిన పోరాటాలను తెలియజేస్తాం..

కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి..

కావలి,ఆదివారం-05

నెల్లూరు జిల్లా, కావలి:

మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కావలి పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ నాయకులు,ఎమ్మార్పీఎస్ నేతలు,అభిమానులతో కలిసి పూలమాలలు వేసి గౌరవ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగజ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమ ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించి దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. అనంతరం పేద ప్రజలు,ముఖ్యంగా దళితుల హక్కుల సాధన కోసం ఆయన జీవితాంతం కృషి చేసిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.జగజ్జీవన్ రామ్ చూపిన మార్గంలోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.ప్రతి విద్యార్థి జగజ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను చదవాలని, వారి ఆలోచనలు, విలువలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

యువతలో చైతన్యం పెంపొందించడానికి ఇటువంటి మహానుభావుల జీవితాలు మార్గదర్శకమవుతాయని అన్నారు.జగ్జీవన్ రామ్ వేడుకలను వారి జయంతి నాటి నుండి ఏప్రిల్ 14 వరకు పండుగ దినాలు గా దేశ ప్రజలు, బడుగు వర్గాలు జరుపుకుంటారు.బడుగుల హక్కులను కాపాడేందుకు, సమాజాన్ని చైతన్య పరిచేందుకు బాబూ జగ్జీవన్ రామ్ ఉద్యమించారు.బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో  కృషి చేస్తోంది.అలాగే కావలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ గారి పేర్లతో నూతన భవనం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ భవనం ద్వారా యువతకు ఈ మహనీయులు దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు తెలియజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి, ఎమ్మార్పీఎస్ నేతలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని జగజ్జీవన్ రామ్‌కు ఘనంగా నివాళులర్పించారు.


google+

linkedin

Popular Posts