ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

 ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

కావలి పట్టణంలో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను స్థానిక ఎమ్మెల్యే దగుమాటి  వెంకట క్రిష్ణారెడ్డి సూచనల మేరకు కావలి టీడీపీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ దివంగత నందమూరి తారకరామారావు 1982లో పార్టీ స్థాపించి, పేద ప్రజలకి సేవలు అందించడానికి కృషి చేశారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ద్వారా పేదవాళ్లకి ఆశ కల్పించారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో తెలుగు ప్రజల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించడానికి టీడీపీ నిత్యం కృషి చేస్తుందన్నారు. 

ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా భవిష్యత్ లోనూ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఎన్టీఆర్ చేసిన సేవలను, తెలుగు సినీ పరిశ్రమకు అందించిన విశ్వ విఖ్యాతిని వారు ఈ సందర్భంగా కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పోట్లూరి శ్రీనివాసులు, యేగూరి చంద్రశేఖర్, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

google+

linkedin